హుజూరాబాద్లో దళితబంధు పథకం నిలిపివేతపై హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులను రద్దు చేయాలన్న అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ఈసీ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. నిష్పక్షపాత ఎన్నికలకు నిర్ణయం తీసుకునే అధికారం ఈసీకి ఉందని తెలిపింది. కాగా హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో అక్కడ దళితబంధును ఆపాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేయగా.. ఈసీ ఉత్తర్వులను సవాలు చేస్తూ సామాజిక కార్యకర్త మల్లేపల్లి లక్ష్మయ్య, కాంగ్రెస్ నేత జడ్సన్లు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. అలాగే ఉప ఎన్నిక పూర్తయ్యే వరకు ప్రజలకు నేరుగా లబ్ధి చేకూర్చే పథకాలను నిలిపివేయాలంటూ వాచ్ వాయిస్ ఆఫ్ పీపుల్స్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్లను కూడా కలిపి విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్రెడ్డిలతో కూడిన ధర్మాసనం. నాలుగు పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.