తెలంగాణ ఎంసెట్ 2021 ఫలితాలను విద్యా శాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి విడుదల చేశారు. హైదరాబాద్ జేఎన్టీయూలో మంగళవారం 11 గంటల సమయంలో మంత్రి ఫలితాలను విడుదల చేశారు. అయితే పరీక్షా ఫలితాలు విడుదల చేయడంతోనే విద్యార్థులు ఒక్కసారిగా తెలంగాణ ఎంసెట్ అధికారిక వెబ్సైట్ను ఓపెన్ చేశారు. దీంతో భారీగా ఆన్లైన్ ట్రాఫిక్ పెరగడంతో తెలంగాణ ఎంసెట్ అధికారిక వెబ్సైట్ పనిచేయడం లేదు. ప్రస్తుతం అధికారులు ఈ సమస్యను పరిష్కరించే పనిలో ఉన్నారు. ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మా కోర్సుల ఎంసెట్ ర్యాంకులను మంత్రి ప్రకటించారు. రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఈనెల 4, 5, 6 (ఇంజినీరింగ్), 9, 10 తేదీల్లో (వ్యవసాయ, ఫార్మా ఎంసెట్) పరీక్షను నిర్వహించారు. ఇక ఈ ఏడాది జరిగిన ఎంసెట్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్షకు 90 శాతం మంది హాజరుకాగా అగ్రికల్చర్, మెడికల్ ఎంట్రన్స్కు 91.19 శాతం మంది విద్యార్థలు హాజరయ్యారు. ఈ ఏడాది ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం 45 శాతం మార్కుల నిబంధనను ప్రభుత్వం ఎత్తివేసిన విషయం తెలిసిందే. 30వ తేదీ నుంచి రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్ల భర్తీ కోసం కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది.సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు ఈనెల 30 నుంచి సెప్టెంబర్ 9 వరకు ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవాలని అధికారులు తెలిపారు.