సీఎం కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవల్లి పోలీసుల దిగ్బంధంలోకి వెళ్లింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రచ్చబండ నేపథ్యంలో ఎర్రవల్లికి కొత్తవారిని అనుమతించేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. అయితే ఎన్ని నిర్బంధాలు పెట్టినా ఎర్రవల్లికి వెళ్లి తీరుతానని రేవంత్రెడ్డి స్పష్టంచేశారు. చెప్పినట్లే మధ్యాహ్నం 2 గంటలకు రచ్చబండ నిర్వహిస్తానని తెలిపారు. ఈ ఉదయం జూబ్లిహిల్స్లోని ఆయన ఇంటిని పోలీసులు మోహరించి గృహనిర్బంధం చేశారు. ఈ నేపథ్యంలో రేవంత్ మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ దొంగతనం బయటపడుతుందనే తమను అడ్డుకుంటున్నారని విమర్శించారు. రైతులను వరి వేయొద్దన్న కేసీఆర్ ఫామ్ హౌజ్లో వరి ఎలా పెట్టారని ప్రశ్నించారు. ఎర్రవల్లి గ్రామం ఏమన్నా నిషేధిత ప్రాంతమా అని నిలదీశారు. ఎందుకు తమను రచ్చబండ నిర్వహించకుండా అడ్డుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్, బీజేపీలు కుమ్ముకై వడ్ల అంశాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే మంత్రులు దిల్లీ నుంచి తిరిగి వచ్చారన్నారు. ఇప్పుడు బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష చేస్తున్నారని… బండి సంజయ్ దీక్షపై కేటీఆర్ లేఖ రాశారని తెలిపారు. బీజేపీ, టీఆర్ఎస్లు కుమ్ముక్కు రాజకీయాలను ప్రజల్లో ఎండ గడతామని హెచ్చరించారు.