జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. నేడు (శుక్రవారం) రీ కన్స్ట్రక్ట్ చేయనున్నారు. ఇప్పటికే ప్రధాన నిందితుణ్ని విచారిస్తోన్న పోలీసులు.. అతడి నుంచి కీలక సమాచారం రాబట్టే పనిలో ఉన్నారు. మరోవైపు బాధితురాలి నుంచి రెండోసారి స్టేట్మెంట్ తీసుకున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు బయటపెట్టడంతో.. ఈ కేసు రాజకీయ రంగు పులుముకున్న సంగతి తెలిసిందే.కాగా ఈ ఘటనపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఈ ఘటన పట్ల బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు గళం విప్పకపోతే.. ఈ కేసు ఎక్కడికిపోయి ఉండేదో ఆ దేవుడికే తెలుసన్నారు. అసలు కేసును పక్కబెట్టి.. రఘునందన్ రావుపై పెట్టిన కేసుపై ఫోకస్ పెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. అమ్మాయికి న్యాయం జరగడం కోసం వ్యవస్థతో పోరాడుతున్న దుబ్బాక ఎమ్మెల్యేకు మనం రుణపడి ఉండాలని వర్మ ట్వీట్ చేశారు. బాధితురాలితోపాటు నిందితులు కూడా మైనర్లు కావడంతో ఓ న్యాయవాది ఫిర్యాదుతో అబిడ్స్ పోలీసు స్టేషన్లో దుబ్బాక ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. పోలీసులు ఆయనకు నోటీసులు పంపారు.