ఏపీ సర్కారుపై తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్రావు మరోసారి కీలక కామెంట్స్ వేశారు. ఏపీ ప్రభుత్వం టీచర్లపై కేసులు పెట్టి లోపల వేస్తుందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఐదేళ్లలో ఉపాధ్యాయులకు 73 శాతం ఫిట్మెంట్ ఇచ్చామని వివరించారు. జీతాలు కొంచెం లేట్ అవుతున్న మాట వాస్తవమేనని వ్యాఖ్యానించారు. మోటార్లకు మీటర్లు పెట్టబోమని తెలంగాణ ప్రభుత్వం అంటే.. రాష్ట్రానికి ఇచ్చే 30 వేల కోట్లు కేంద్రం ఆపేసిందని హరీశ్ రావు ఆరోపించారు. ఏపీ సీఎం జగన్లా కేంద్రం షరతులకు ఒప్పుకొని ఉంటే.. ఏటా రూ.6 వేల కోట్లు అప్పులు తీసుకొని మరిన్ని పథకాలను ప్రవేశపెట్టేవాళ్లమని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అందరి సంక్షేమం కోసం ఆలోచిస్తుందని స్పష్టం చేశారు. గతంలోనూ తెలంగాణ మంత్రులు ఏపీలోని పరిస్థితులపై వ్యాఖ్యలు చేశారు. ఏపీలో విద్యుత్ సరఫరాపైనా ఆ మధ్య హరీశ్రావు కామెంట్స్ చేశారు. తాను తిరుపతి వెళ్లినప్పుడు అక్కడ కొందరిని కలసి మాట్లాడానని.. కరెంట్ సరఫరా గురించి వాళ్లు అన్న మాటలు విన్న తర్వాత తెలంగాణ ఎంతో నయమనే విషయం తనకు అర్థమైందన్నారు. ఏపీలో రోడ్ల పరిస్థితిపై గతంలో మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్స్ రచ్చకు దారితీశాయి.