Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

ఏలూరు కోర్టుకే వెళ్లాలి.. తెలంగాణ అగ్రిగోల్డ్‌ డిపాజిటర్లకు సుప్రీంకోర్టు సూచన

అగ్రిగోల్డ్‌ కేసులో తెలంగాణకు చెందిన డిపాజిటర్లు కూడా ఏపీలోని ఏలూరులో ఈ కేసు కోసం ఏర్పాటు చేసిన కోర్టుకే వెళ్లాలని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సూచించింది. ఏలూరు కోర్టులో ఈ కేసు పరిష్కారం కాని పక్షంలోనే హైకోర్టుకు గానీ, సుప్రీంకోర్టుకుగానీ వెళ్లేందుకు అవకాశం ఉంటుందని కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడిరది. ఈ మేరకు తెలంగాణ అగ్రిగోల్డ్‌ డిపాజిటర్ల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అగ్రిగోల్డ్‌ సంస్థ ఏకంగా 32 లక్షల మంది డిపాజిట్లను నట్టేట ముంచిందని, ఈ వ్యవహారంలో ఆ సంస్థ రూ.6 వేల కోట్ల పైచిలుకు మొత్తాన్ని సేకరించిందని.. తెలంగాణ అగ్రిగోల్డ్‌ డిపాజిటర్ల సంఘం తరఫు న్యాయవాది వాదించారు. ఈ వాదనలను కూడా పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ముందుగా ఏలూరు కోర్టుకే వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. అగ్రిగోల్డ్‌ సంస్థకు చెందిన కొన్ని ఆస్తులను వేలం వేయడం ద్వారా తెలంగాణ హైకోర్టు కేవలం రూ.50 కోట్లే రాబట్టిందన్న డిపాజిటర్లు… ఆ తర్వాత కేసును ఏలూరు కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు చెప్పిందని సుప్రీంకోర్టుకు తెలిపారు. కేసును ఏలూరు కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు చెప్పిన తెలంగాణ హైకోర్టు తీర్పును వారు సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. అయితే హైకోర్టు తీర్పును రద్దు చేయడం గానీ, మార్చడం గానీ చేసేందుకు సుప్రీంకోర్టు అంగీకరించలేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img