కరోనా నిబంధనలు పాటిస్తే ఏ వేరియంట్ మన దరి చేరదని ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. జాగ్రత్త ఉంటే కరోనాను అరికట్టొచ్చు. టీకాలు ప్రతి ఒక్కరూ తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఓల్డ్ బోయిన్పల్లిలో బస్తీ దవాఖానాను మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రసంగించారు. రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల 51 లక్షల మంది మొదటి డోసు తీసుకున్నారని, రెండో డోసు కోటి 30 లక్షల మంది మాత్రమే తీసుకున్నారని తెలిపారు. చాలా మంది రెండో డోసు తీసుకోలేదన్నారు. ఈ సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందన్నారు. టీకాలు సురక్షితమైనవి. అనుమానాలు, అపోహాలు అవసరం లేదు. రెండు డోసులు తీసుకుంటే మన ప్రాణాలను కాపాడుకోవచ్చని అన్నారు. 18 ఏండ్లు దాటి ప్రతి ఒక్కరూ రెండు డోసులు తీసుకోవాలని సూచించారు.