నగరంలోని రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలోని సన్ రైజ్ హోమ్ కాలనీలో ఏర్పాటుచేసిన మొబైల్ వ్యాక్సిన్ కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శనివారం పరిశీలించారు. గ్రేటర్ హైదరాబాద్లో శనివారం నుండి ప్రారంభించిన రెండవ డోస్ కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం.రిజ్వీ, జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్లు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎస్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇప్పటికే మూడు కోట్లకు పైగా కోవిద్ వ్యాక్సిన్ లను అందచేశామని తెలిపారు. కరోనా నివారణకు కేవలం వ్యాక్సిన్ తీసుకోవడమే మార్గమని చెప్పారు. నేటి నుండి పది రోజులపాటు ఏర్పాటు చేసిన 150 మొబైల్ వ్యాక్సిన్ కేంద్రాల ద్వారా రెండో డోస్ ను వేయడం జరుగుతుందని వైద్య శాఖ కార్యదర్శి రిజ్వీ వివరించారు.