కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రజలంతా కలిసి రావాలని, ముందు జాగ్రత్తగా కొవిడ్ టీకాలు తీసుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. బుధవారం కరీంనగర్లోని బుట్టిరాజారామ్ కాలనీలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 12-14 పిల్లలకు కొవిడ్ వ్యాక్సినేషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కరోనా మహమ్మారిని కలిసికట్టుగా తరిమివేద్దామని అన్నారు. 60 సంవత్సరాల వయసు దాటిన వారంతా బూస్టర్ డోస్ తీసుకోవాలని సూచించారు. కొవిడ్-19 టీకా మొదటి డోసును 100శాతం పూర్తి చేశామని, రెండో డోస్ను 105శాతం పూర్తి చేసి జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపామన్నారు. 15 నుంచి 17 సంవత్సరాల వయసు గల వారికి సుమారు 50వేల మందికి మొదటి డోస్ వ్యాక్సినేషన్ 98 శాతం పూర్తిచేశామని తెలిపారు. 12 నుంచి 14 సంవత్సరాల వయసుగల పిల్లల్ని జిల్లాలో 44 ,570 మంది ఉన్నట్లు గుర్తించామని, వీరందరికీ మొదటి డోస్ వ్యాక్సినేషన్ పూర్తిచేశాక, 28 రోజుల తర్వాత రెండో డోసు టీకాలు వేస్తామన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా కొవిడ్ టీకాలు వేయించాలని సూచించారు.