బీజేపీ ప్రభుత్వం తెలంగాణ సంక్షేమ పథకాలను కాపీ కొట్టి కేంద్రంలో అమలు చేస్తోందని మంత్రి తన్నీరు హరీశ్ రావు విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలు కాపీ కొడుతున్నారంటే.. మన పరిపాలన బాగున్నట్టే కదా అని ఆయన అన్నారు. ‘బీజేపీ నేతలు ఇక్కడికొచ్చి మనం ఏం చేస్తలేం అంటారు. ఢల్లీికి పోయి మన పథకాలు కాపీ కొడుతున్నారు’ అని అన్నారు. దేశంలో ఎంత మంది ప్రధాన మంత్రులు మారినా, రాష్ట్రంలో ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా.. ప్రజల కనీస అవసరాలు తీర్చలేకపోయారని, కనీసం తాగునీరు ఇవ్వలేకపోయారని ఆయన దుయ్యబట్టారు. కాంగ్రెస్, బీజేపీ పాలనను ఎండగట్టారు. సిద్దిపేట పట్టణంలోని 37వ వార్డు నుంచి, సిద్దిపేట అర్బన్ మండలం బక్రిచెప్యాల నుంచి బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు మంత్రి హరీశ్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన హరీష్ రావు అనంతరం జరిగిన సమావేశంలో ప్రసంగించారు. ‘ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో మూడున్నరేళ్లలో మిషన్ భగీరథ పథకం కింద ఇంటింటికీ తాగునీరు అందించాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దీన్ని కాపీ కొట్టి ‘హర్ ఘర్ కో జల్’ పేరుతో అమలు చేస్తోంది. మిషన్ కాకతీయ పథకంలో వేలాది చెరువలును బాగు చేశాం. నాటి కాకతీయుల కాలం నాటి చెరువులను వారసత్వ సంపదకు పూర్వ వైభవంగా 40 వేల చెరువులను బాగు చేకున్నాం. ఇదే మిషన్ కాకతీయ పథకాన్ని కేంద్రం ‘అమృత్ సరోవర్’ పేరుతో కాపీ కొట్టింది’ అని మంత్రి హరీశ్ రావు అన్నారు. మూగజీవాల కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 120 అంబులెన్స్లను ఏర్పాటు చేసి, డయల్ 1962 ఎమర్జెన్సీ నంబర్ ఏర్పాటు చేస్తే.. కేంద్రం ఇదే పథకాన్ని కాపీ కొట్టి దేశమంతా అమలు చేస్తోందని హరీశ్ అన్నారు. రైతులకు పెట్టుబడి సాయం కింద రైతుబంధు పేరుతో ఎకరాకు రూ.5 వేలు ఇస్తే, కేంద్రం ‘పీఏం కిసాన్ యోజన’ పేరుతో ఈ పథకాన్ని కాపీ కొట్టి అమలు చేస్తోందని చెప్పుకొచ్చారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలతో తెలంగాణ నేడు దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. నాడు ఉద్యమ సమయంలో, నేడు అభివృద్ధిలో సిద్దిపేట ముందు వరుసలో నిలిచిందని మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్ధిపేట నియోజకవర్గం రాష్ట్రంలోనే ఇతర నియోజకవర్గాలకు అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచిందని ఆయన అన్నారు. అభివృద్ధితో పాటు సేవలో ఆదర్శంగా నిలిచిందని కితాబిచ్చారు. ఇది ప్రజల భాగస్వామ్యం, ప్రజల సహకారంతోనే సాధ్యమైందన్నారు. సిద్ధిపేట అభివృద్ధి చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని దుయ్యబట్టారు.