అమిత్ షాపై పరోక్షంగా కేటీఆర్ విమర్శలు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు మంత్రి కేటీఆర్ చురకలంటించారు. పరోక్షంగా అమిత్ షాను ఉద్దేశిస్తూ.. ప్రజలను విభజించేందుకు వచ్చారని విమర్శించారు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ‘‘74 ఏళ్ల క్రితం ఒక కేంద్ర హోం మంత్రి తెలంగాణ ప్రజలను ఇండియన్ యూనియన్ లో విలీనం చేసి సమైక్యతను చాటారు. ఇవాళ ఓ కేంద్ర హోం మంత్రి తెలంగాణ ప్రజలను విభజించి.. రాష్ట్ర ప్రభుత్వంపై బెదిరింపులకు పాల్పడేందుకు వచ్చారు. అందుకే చెబుతున్నాను. దేశానికి కావాల్సింది విభజన రాజకీయాలు కాదు. నిర్ణయాత్మక రాజకీయాలు కావాలి’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
బీజేపీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై అమిత్ షా విమర్శలు గుప్పించారు. దీనిపై స్పందించిన కేటీఆర్ పరోక్షంగా అమిత్ షాను ఉద్దేశిస్తూ ఘాటుగా ట్వీట్ చేశారు. కాగా మంత్రి కేటీఆర్ తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.