ఏసీ గదులను వదిలిపెట్టి రాహుల్ ప్రజల్లోకి వచ్చారని కితాబు
రాహుల్ పాదయాత్రకు పార్టీలకు అతీతంగా ప్రజల నుంచి స్పందన వస్తోందన్న సురేఖ
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు పార్టీలకు అతీతంగా ప్రజల నుంచి మద్దతు వస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. పాదయాత్రకు జనాలను తరలిస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని… తాము తరలిస్తే వంద, రెండు వందల మంది మాత్రమే వస్తారని… ఇంత మంది వస్తున్నారంటే పార్టీలకు అతీతంగా జనాలు వస్తున్నారనే విషయం అందరికీ అర్థం అవుతుందని చెప్పారు. రాహుల్ కావాలనుకుంటే ప్రధాని అయ్యుండేవారని, కేంద్ర మంత్రి అయ్యుండేవారని… అలాంటి వ్యక్తి ఏసీ గదులను వదిలిపెట్టి జనాల్లోకి వచ్చారని అన్నారు. టీఆర్ఎస్ లో నిరంకుశత్వం నడుస్తోందని… మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా మాట్లాడే పరిస్థితి లేదని సురేఖ విమర్శించారు. కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఉందని… తప్పులు, ఒప్పులు గురించి మాట్లాడే స్వేచ్ఛ కాంగ్రెస్ లో ఉందని చెప్పారు. కేసీఆర్ కు ధైర్యం ఉంటే రాహుల్ మాదిరి జనాల్లో పాదయాత్ర చేయాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవిని కూడా రాహుల్ వదులుకున్నారని… టీఆర్ఎస్ అధ్యక్ష పదవిని కూతురు కవితకు కేసీఆర్ నాలుగు రోజులైనా ఇవ్వగలరా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ను తిట్టడం వల్ల కేసీఆర్ కే ఎఫెక్ట్ అవుతుందని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్ ల పాత వీడియోలు ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నాయని… వీరిద్దరూ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని అన్నారు. అధికారం ఉందికదా అని మేము ఏం మాట్లాడినా నడుస్తుంది అనుకుంటే పొరపాటేనని… రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవని సురేఖ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా పేదల పక్షమేనని అన్నారు. టీఆర్ఎస్, బీజేపీ రెండూ కలిసి ఫామ్ హౌస్ డ్రామా ఆడాయని… కాంగ్రెస్ ను ఓడిరచడమే ఈ పార్టీల లక్ష్యమని చెప్పారు. మంత్రి కేటీఆర్ ఒక బచ్చా అని… కేసీఆర్ పెద్ద డ్రామా రాయుడు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.