: ఈటల రాజేందర్
హుజురాబాద్లో ప్రచారం చేసిన మంత్రులు, ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో సభలు నిర్వహిస్తానని, వాళ్ల భరత పడతానని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనను గెలిపించిన హుజురాబాద్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. హుజురాబాద్ ప్రజల రుణం తీర్చుకోలేనిదన్నారు.తనకు అండగా ఉన్న కేంద్రమంత్రి అమిత్షాకు ఈటల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన గెలుపునకు కృషి చేసిన బీజేపీ నేతలకు కృతజ్ఞతలు చెప్పారు.ఉపఎన్నికలో టీఆర్ఎస్ నేతలు వందల కోట్లు ఖర్చు పెట్టారని, డబ్బులు ఖర్చుపెట్టి ప్రజలను వేధింపులకు గురిచేశారని అన్నారు. ప్రజలు కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలు సరైన గుణపాఠం చెప్పారన్నారు. ఇది కేసీఆర్ అహంకారంపై తెలంగాణ ప్రజలు సాధించిన గెలుపుగా అభివర్ణించారు. కుట్రలు చేసేవారు.. ఆ కుట్రలతోనే నాశనం అవుతారన్నారు. హుజురాబాద్ అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని అన్నారు. దళిత బంధు పది సార్లు ఇస్తామన్నా ధర్మం వైపే ప్రజలు నిలబడ్డారని, డబ్బులు పంచినోళ్ళను తన్ని తరిమేశారన్నారు.