సమస్య యాసంగి పంటదని వాటిపై మాట్లాడకుండా కేసీఆర్ బీజేపీతో కుమ్మక్కై నాటకాలు ఆడుతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు.బీజేపీ చెప్పిందే సీఎం కేసీఆర్ చేస్తున్నారని అన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వెంకటాపురంలో పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ ఆయన మంత్రులు చెప్పేదొకటి, చేసేదొకటి..టీఆర్ఎస్ ఎంపీలు, మంత్రులు దిల్లీ వెళ్లి వానాకాలం పండిన పంటను కొనుగోలు చేయమని అడగడం విడ్డురంగా ఉందని అన్నారు. ఖమ్మం జిల్లాలో వరి సాగుపైనే ఆధారపడి రైతులు జీవిస్తున్నారని వేరే పంటలు సాగు చేస్తే నష్ట పోతారని చెప్పారు.ఇప్పటికే మిర్చి, పత్తి పంట సాగు చేసిన రైతులు తీవ్రంగానష్టపోయారని వాటికి నష్టపరిహారం ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచించాలని ప్రభుత్వాన్ని కోరారు. యాసంగిలో పంట కొనుగోలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ శాఖ మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.