Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

కొత్త పార్లమెంట్‌ భవనానికి అంబేద్కర్‌ పేరుపెట్టాలి : మంత్రి కేటీఆర్‌

నూతన పార్లమెంట్‌ భవనానికి డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ పేరు పెట్టాలంటూ తెలంగాణ అసెంబ్లీలో త్రి కేటీఆర్‌ తీర్మానం ప్రవేశపెట్టారు. అసెంబ్లీ మూడో రోజు సమావేశాల్లో కేటీఆర్‌ మాట్లాడుతూ స్వేచ్ఛ, సమానత్వం కోరిన వ్యక్తి అంబేడ్కర్‌ అని.. అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. అంబేద్కర్‌ చూపిన బాటలో తెలంగాణ రాష్ట్రం పయనిస్తుందని.. అంబేద్కర్‌ తత్వాన్ని టీఆర్‌ఎస్‌ ఆచరణలో చూపిస్తుందని కేటీఆర్‌ చెప్పారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రతీక అయిన పార్లమెంట్‌ భవనానికి అంబేద్కర్‌ పేరు పెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. తాను రాసిన రాజ్యాంగం దుర్వినియోగమైతే.. దాన్ని ముందు తానే తగలబెడతానని చెప్పిన వ్యక్తి అంబేద్కర్‌ అని కేటీఆర్‌ గుర్తు చేశారు.
మంత్రి కేటీఆర్‌ ప్రవేశపెట్టిన తీర్మానానికి తాము ఏకగ్రీవంగా ఆమోదం తెలుపుతూ మద్దతు ఇస్తున్నట్లు కాంగ్రెస్‌ సీఎల్పీ లీడర్‌ భట్టి విక్రమార్క తెలిపారు. నూతన పార్లమెంట్‌ భవనానికి అంబేద్కర్‌ పేరు పెట్టాలని కోరారు. స్వేచ్ఛ, సమానత్వం కోసం అంబేడ్కర్‌ పోరాడారని.. కానీ, ప్రస్తుతం ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడితే ఐటీ దాడులతో భయపెడుతున్నారని భట్టి విమర్శించారు. పార్లమెంట్‌కు అంబేడ్కర్‌ పెడితే, ఈ దేశ నిర్మాణం సరిగ్గా సాగుతుందన్నారు. అదేవిధంగా పంజాగుట్టలో అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. పంజాగుట్టలో అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని భట్టి విక్రమార్క చేసిన డిమాండ్‌పై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. 125 అడుగుల విగ్రహాన్ని తెలంగాణతో పాటు యావత్‌ దేశం గుర్తు పెట్టుకునేలా నిర్మిస్తామని మంత్రి చెప్పారు. అయితే, పంజాగుట్టలో కాకుండా ట్యాంక్‌బండ్‌ సమీపంలో విగ్రహ నిర్మాణం సాగుతోందని తెలిపారు. ప్రస్తుతం సుప్రీం కోర్టు గైడ్‌లైన్స్‌ ప్రకారం చర్యలు తీసుకుని పంజాగుట్టలో విగ్రహం నిర్మించలేకపోతున్నామని వివరణ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img