జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి
కొవిడ్ నివారణ చర్యలకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. బస్తీల్లో, కాలనీలో ముమ్మరంగా చేపట్టిన వ్యాక్సినేషన్ శిబిరాలను స్థానికులు వినియోగించుకోవాలన్నారు. శుక్రవారం బంజారాహిల్స్ రోడ్డు నంబరు-10లోని పంచవటికాలనీని కార్పొరేటర్ మన్నె కవితారెడ్డితో కలిసి సందర్శించారు. కాలనీలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి కావడంలో స్థానికులను ఆమె అభినందించి కమిటీ ప్రతినిధులకు జీహెచ్ఎంసీ ప్రశంసా పత్రాన్ని అందజేశారు.అనంతరం ఇబ్రహీంనగర్లోని వ్యాక్సినేషన్ శిబిరాన్ని సందర్శించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, జీహెచ్ఎంసీ సిబ్బంది, కాలనీవాసులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.