Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఇవే చివరి ఎలక్షన్స్‌ : మంత్రి జగదీశ్‌

మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమని మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నారు. అక్కడ బీజేపీ మూడో స్థానంలో నిలుస్తుందని ఎద్దేవా చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి జగదీశ్‌ రెడ్డి సోమవారం పాల్గొన్నారు. అలాగే మర్రిగూడ బైపాస్‌ జంక్షన్‌, క్లాక్‌ టవర్‌ సెంటర్‌ను కూడా మంత్రి ప్రారంభించారు. 100 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. చట్టబద్ధ సంస్థ అయిన ఎన్ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ను రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ వాడుకుంటూ ఉందని మంత్రి ఆరోపించారు. అలాంటి ఈడీలు బోడీలు అంటూ బీజేపీ బెదిరింపులతో సీఎం కేసీఆర్‌ను లొంగదీసుకోవాలని చూస్తోందని అన్నారు. అలా చేయడం ఎవరి వల్లా సాధ్యం కాదని స్పష్టం చేశారు.
నల్గొండలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌ రెడ్డితో కలిసి మంత్రి జగదీష్‌ రెడ్డి ప్రారంభించారు. మునుగోడు అభివృద్ధి సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని అక్కడి ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని అన్నారు. కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి బ్రదర్స్‌కు ఈ మునుగోడు ఎన్నికలే ఆఖరి ఎన్నికలని మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నారు. రాజగోపాల్‌ రెడ్డికి మోదీ ఏకంగా రూ.22 వేల కోట్ల విలువైన కాంట్రాక్టు దక్కేలా చేశారని, అందుకే బీజేపీలోకి వెళ్తున్నారని అన్నారు. ఆ దన్నుతోనే రాజగోపాల్‌ రెడ్డి అహంకారంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. బీజేపీ దుర్మార్గాలను, ప్రధాని మోదీ అసమర్థ పాలనను ఎండగట్టేందుకు బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. అందుకోసం మునుగోడు ఉపఎన్నికలో వామపక్షాలు టీఆర్‌ఎస్‌తో కలిసి రావాలని కోరారు.
ఈ నెల 20న టీఆర్‌ఎస్‌ పార్టీ మునుగోడులో నిర్వహించే ప్రజాదీవెన సభకు కార్యకర్తలు, ప్రజలు పెద్దసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img