నిఖత్ జరీన్, ఇషాసింగ్కు సీఎం కేసీఆర్ సన్మానం, ఆతిథ్యం
తెలంగాణ కీర్తిని ప్రపంచానికి చాటిన బాక్సర్ నిఖత్ జరీన్, షూటర్ ఇషా సింగ్లను ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు ప్రగతి భవన్లో ఘనంగా సన్మానించారు. శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్.. నిఖత్ జరీన్, ఇషా సింగ్, వారి కుటుంబ సభ్యులతో కలిసి లంచ్ చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ వారితో ముచ్చటించారు. నిఖత్ జరీన్ పట్టుదలను, ఆత్మస్థైర్యాన్ని సీఎం కేసీఆర్ అభినందించారు. తెలంగాణ క్రీడాకారులకు తాను ఎల్లవేళలా అండగా వుంటానని, క్రీడారంగాన్ని ప్రోత్సహించి, రేపటి తరాలను శారీరకంగా, మానసికంగా, ధృఢంగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. పుట్టిన తెలంగాణ గడ్డకు కీర్తి ప్రతిష్టలు తెచ్చిన నిఖత్ జరీన్, ఇషా సింగ్లను చూసి తెలంగాణ యువతీ యువకులు స్పూర్తి పొందాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో క్రీడలు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ మధుసూధనాచారి, ఎమ్మల్యే గణేశ్ గుప్తా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎం కార్యదర్శి భూపాల్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.