మాదన్నపేట చెరువులో చేప పిల్లలను వదిలిన మంత్రి
మత్య్సకారులు గతంలో అనేక సమస్యలతో సతమతం అయ్యేవారని.. కానీ ఇప్పుడు వారికి ప్రభుత్వం అండగా నిలిచి.. ఆర్థికంగా ఎదిగేలా చర్యలు తీసుకుంటోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మాదన్నపేట చెరువులో.. ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ గోపితో కలిసి చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడారు. మాదన్నపేట చెరువులో 6.32 లక్షల చేప పిల్లలను వదిలినట్టు వెల్లడిరచారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా.. తెలంగాణలో చేప పిల్లల పంపిణీ చేపట్టామని.. దీంతో మత్స్యకారుల కష్టాలు తీరి.. వారు ఆర్ధికంగా ఏదిగారని చెప్పారు. సొసైటీ ఏర్పాటు చేసి.. మత్య్సకారులకు హక్కులు కల్పించిన ఏకైక ప్రభుత్వం తమదేనని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు.. డబ్బులు పెట్టి చేప పిల్లలు కొనే స్థోమత లేక.. ఇబ్బందులు పడేవారని గుర్తుచేశారు. కానీ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 100 శాతం రాయితీతో చేప పిల్లలు పంపిణీ చేస్తున్నట్టు వివరించారు. ఇందుకోసం రూ.500 కోట్లు ఖర్చు పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని వివరించారు. ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ మాట్లాడుతూ.. మార్కెటింగ్లో మహిళలను చైతన్య పరచాలని సూచించారు. ఆర్థికంగా ఎదగడానికి అవసరమైన శిక్షణ ఇప్పించాలన్నారు. కాళేశ్వరం వల్ల 753 చెరువులు.. 365 రోజులు నిండు కుండల్లా ఉంటున్నాయని చెప్పారు. దీన్ని మత్స్యకారులు వినియోగించుకొని.. బాగుపడాలని సూచించారు. తెలంగాణ ప్రజల వృత్తి, జీవితాల పట్ల మన ముఖ్యమంత్రి కేసీఆర్ కు పూర్తి అవగాహన ఉందని చెప్పారు. రాష్ట్రం ఆర్ధికంగా అభివృద్ధి కావడానికి.. నీటి వనరులు దోహదపడతాయని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం 5వేల సొసైటీలు ఉన్నాయని.. ఇంకా పెంచేందుకు స్పెషల్ డ్రైవ్లను చేపట్టామని చెప్పారు.