బీజేపీ అనుబంధసంస్థగా ఈడీ .. : ఎమ్మెల్యే సీతక్క
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని ఈడీ విచారణ జరుపుతున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు గాంధీభవన్లో సత్యాగ్రహ దీక్షకు దిగారు. దీక్షలో మాట్లాడిన ములుగు ఎమ్మెల్యే సీతక్క తనదైన శైలిలో కేంద్రం తీరుపై విరుచుకుపడ్డారు. బీజేపీ నేతలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. గాంధీ వారసులను గాడ్సే వారసులు ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన ఈడీ కన్ను వేసిందని, ఇది కక్షసాధింపు చర్య తప్ప మరొకటి కాదని పేర్కొన్నారు. ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ బీజేపీ అనుబంధ సంస్థగా పని చేస్తుందంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.దేశాన్ని దోచుకున్న దొంగల పట్ల ఈడీ అధికారులు కళ్ళు మూసుకున్నారు అని ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. బ్రిటిష్ వాళ్ళు ఇండియాని దోచుకున్నట్టు ఇప్పుడు దేశాన్ని కొందరు దోచుకు తింటున్నారని సీతక్క మండిపడ్డారు. దేశంలో ప్రతి వస్తువు పై గబ్బర్ సింగ్ టాక్స్ వేస్తున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు చాలా ఫ్రెండ్లీ ఫైట్ చేస్తున్నాయని ఆరోపించిన సీతక్క, ఇరు పార్టీల డ్రామాలు ప్రజలు అర్థం చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ దానితో టీఆర్ఎస్ పార్టీ ఎంత ప్రయత్నం చేసిన కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి తీరుతుందని ఎమ్మెల్యే సీతక్క తేల్చిచెప్పారు.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ మరోమారు ఈడీ విచారణకు హాజరయ్యారు. నేషనల్ హెరాల్డ్ కేసులో భాగంగా సోనియాగాంధీని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. 21వ తేదీన తొలిసారిగా సోనియాగాంధీని విచారించిన ఈడీ అధికారులు మూడు గంటల పాటు ఆమెను ప్రశ్నించారు. ఈడీ అధికారులు అడిగిన ఇరవై ఎనిమిది ప్రశ్నలకు సోనియాగాంధీ సమాధానమిచ్చారు. ఇక మళ్లీ నేడు కూడా ఈడీ అధికారులు సోనియాగాంధీని విచారిస్తున్నారు. సోనియా గాంధీపై ఈడీ అధికారుల విచారణ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలు నిర్వహిస్తోంది.