లోక్సభలో ఎంపీ రంజిత్రెడ్డి
మంచినీటి సరఫరా కోసం మిషన్ భగీరథ ద్వారా 100 శాతం గ్రామాలకు నల్లాల ద్వారా ఇంటింటికీ మంచినీరు అందిస్తున్నామని పార్లమెంట్లో చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ మంచి నీటి సరఫరా కోసం ప్రాజెక్టుల మంజూరుపై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సంబంధిత గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ను ఎంపీ రంజిత్రెడ్డితో పాటు పసునూరి దయాకర్, వెంకటేశ్ నేత, మాలోత్ కవితతో కలిసి లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నించారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం కెసీఆర్ తీసుకుంటున్న చర్యలను సభ దృష్టికి తీసుకెళ్లారు. గాంధీజీ చెప్పిన గ్రామ స్వరాజ్యాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతల్లో అమలు చేసి చూపిస్తున్నారని చెప్పారు. పల్లె ప్రగతి పథకం ద్వారా గ్రామాల అభివృద్ధికి స్థానికంగానే ప్రజలు ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారన్నారు.గ్రామ స్థాయిలో సర్పంచ్ లకే పూర్తి స్థాయి అభివృద్ధి అధికారాలు అప్పగించామని చెప్పారు. రాష్ట్రంలో అనుసరిస్తున్న విధానాలను దేశవ్యాప్తంగా అనుకరించాలని కూడా కేంద్రం దేశంలోని మిగతా రాష్ట్రాలకు సూచించిన విషయాన్ని ఎంపీ రంజిత్ గుర్తు చేశారు.