నల్గొండ జిల్లా చండూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ఆఫీసులోని కండువాలు, పోస్టర్లు, బ్యానర్లతో పాటు ఇతర సామగ్రి కాలిపోయాయి. ఈ ఘటనపై కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి దివంగత నేత పాల్వాయి గోవర్దన్ రెడ్డి కుమార్తె స్రవంతి పోటీ చేస్తున్నారు.దీంతో ప్రచారానికి వీలుగా చండూరులో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. సోమవారం రాత్రి ఈ కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ నేతలు కోరారు.కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా ఇవాళ చండూర్లో రేవంత్ సభ జరగనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీసుకు దుండగులు నిప్పు పెట్టడం కలకలం రేపింది. దీనిపై ఆయన స్పందిస్తూ, మునుగోడులో ఎగిరేది కాంగ్రెస్ జెండా అని అన్నారు. జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్, బీజేపీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ ఘటనపై 24 గంటల్లో నిందితులను పట్టుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఎస్పీ ఆఫీస్ ఎదుట ధర్నా చేస్తామని రేవంత్ హెచ్చరించారు. కాంగ్రెస్ క్యాడర్ ను బెదిరించాలని టీఆర్ఎస్, బీజేపీ కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. మునుగోడులో ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్లు వేశారు.