తెలంగాణ నేతన్నలకు దేశంలో ప్రత్యేకమైన గుర్తింపు ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. చేనేత కార్మికులకు ఉపాధి, ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నాం అని తెలిపారు. నగరంలోని పీపుల్స్ ప్లాజాలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ హాజరై ప్రసంగించారు. 2018 నుంచి కొండా లక్ష్మణ బాపూజీ పేరుతో అద్భుతమైన చేనేత కళాకారులను సత్కరించి, అవార్డులు అందిస్తున్నామని తెలిపారు. అవార్డుతో పాటు నగదు పురస్కారం రూ. 25 వేలను అందించడం జరుగుతుందన్నారు. ఈ ఏడాది 31 మంది చేనేత కళాకారులను సత్కరించుకున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా చేనేత కళాకారులచే మంత్రి కేటీఆర్ ప్రతిజ్ఞ చేయించారు.