ఆర్టీసీ ఎండీ సజ్జనార్
ఆర్టీసీ చార్జీలను పెంచాల్సిన అవసరం ఉందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుందని అనుకుంటున్నామని అన్నారు. కొన్ని కారణాల వల్ల ఆర్టీసీ బస్సులు, సిబ్బందిలో మార్పులు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. ఇప్పుడిప్పుడే ప్రజలు ఆర్టీసీ వైపు మళ్లుతున్నారన్నారు. యాజమాన్యం తీసుకుంటున్న నిర్ణయం వల్ల ఆదాయం పెరిగిందని, ఓఅర్ కూడా పెరిగిందని చెప్పారు. 1359 రూట్లలో ఆర్టీసీ బస్సులను పునరుద్ధరించామని చెప్పారు. బస్సులు అవసరం ఉన్న చోట లోకల్ డీఎం, ఆర్ఎంలు సర్వే చేస్తున్నారన్నారు. కొన్ని చోట్ల ఆక్యుపెన్సీ తక్కువ..కొన్నిచోట్ల ఎక్కువ ఉందని తెలిపారు. ఎవరికైనా బస్సు అవసరం ఉంటే డీఎంను సంప్రదించాలని సూచించారు.టీఎస్ఆర్టీసీ బస్సులను ఆదరించాలని కోరారు. డీజిల్ పెరుగుదల, కరోన వల్ల ఆర్టీసీ తీవ్ర ఇబ్బందులు పడుతుందన్నారు. ఉద్యోగుల సంక్షేమం ఆర్టీసీకి చాలా ముఖ్యమన్నారు. సీబీఎస్ హాంగర్ ప్లేస్లో కాంప్లెక్స్ నిర్మాణంపై ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు. బస్సు డిపోలను మూసేస్తున్నారని, భూములు అమ్ముతున్నారంటూ వస్తున్న వార్తలపై స్పందిస్తూ, అలాంటి ఆలోచన ఆర్టీసీ యాజమాన్యానికి లేదని స్పష్టం చేశారు.