ట్యాంక్ బండ్పై ‘సండే-ఫన్డే’ సందడి మళ్లీ ప్రారంభం కానుంది. గణేష్ విగ్రహ నిమజ్జనం కారణంగా గత వారం నిలిపివేసిన సండే ఫండే కార్యక్రమం ఈ ఆదివారం (సెప్టెంబరు 26) తిరిగి ప్రారంభంకానుంది. పర్యాటకులను ఆకర్షించేందుకు మరింత ఆకర్షణగా తీర్చిదిద్దేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ సోషల్ మీడియాలో పలు విషయాలను షేర్ చేశారు.దీని ప్రకారం సెప్టెంబర్ 26, ఆదివారం సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ట్యాంక్బండ్ సందర్శకులకు బాణాసంచా ప్రదర్శనతోపాటు తెలంగాణ సాంప్రదాయ జానపద కళల ప్రదర్శన, తెలంగాణ పోలీస్ బ్యాండ్, ఉత్తమ తెలుగు పాటలను అందించే ఆర్కెస్ట్రా ఉంటాయి. దీంతోపాటు ఒగ్గు డోలు, గుస్సాడి, బోనాలు కోలాటం వంటి జానపద కళల ప్రదర్శనల భారీ సందడి ఉండనుంది. అంతేకాకుండా చేనేత వస్త్రాలు, హస్తకళ స్టాల్లు, ప్రభుత్వం, హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ ద్వారా ఉచితంగా మొక్కలు పంపిణీ కూడా ఉంది.