తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో తాగునీటికి సమస్య ఉండకూడదనే ఉద్దేశంతో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టామని, 90 నుంచి 95 శాతం వరకు తాగునీటి సమస్య పరిష్కరించామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా అర్బన్ మిషన్ భగీరథపై అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. రూ. 313 కోట్ల 26 లక్షల వ్యయంతో నలభై ఏడున్నర ఎంఎల్డీ సామర్థ్యం కలిగిన 12 రిజర్వాయర్లను నిర్మించి, 384 కిలోమీటర్ల మేర పైపులైన్ వేయడం ద్వారా ఎల్బీనగర్ నియోజకవర్గంలో తాగునీటి సరఫరాను మెరుగుపరిచామన్నారు. 13.11 కి.మీ. నీటి సరఫరా గల పైపులైన్ నెట్వర్క్ను రూ. 5 కోట్ల 25 లక్షల వ్యయంతో తాగునీరు అందని కాలనీలకు సమకూర్చాలని ప్రతిపాదన చేపట్టి, పూర్తి చేయడం జరిగిందన్నారు.