కేటీఆర్ ట్వీట్
తెలంగాణలోనే మొట్టమొదటి స్టెంట్ల పరిశ్రమ సంగారెడ్డి జిల్లాలో ఏర్పాటవుతోంది. అమీన్పూర్ మండలంలోని సుల్తాన్పూర్, దాయర గ్రామాల మధ్య ఏర్పాటు చేసిన మెడికల్ డివైజెస్ పార్కులో రూ.250 కోట్లతో సహజానంద్ మెడికల్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్ఎంటీ) పరిశ్రమ స్టెంట్ల ఉత్పత్తిని చేపట్టనున్నది. ఈ పరిశ్రమను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం సాయంత్రం ప్రారంభించనున్నారు. ఈ పరిశ్రమను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం సాయంత్రం ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ పరిశ్రమ ఏర్పాటుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా రెండు వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఏటా 1.2 మిలియన్ల కార్డియాక్ స్టెంట్లు, 2 మిలియన్ల కార్డియాక్ బెలూన్లు ఉత్పత్తి చేయనున్నారు. వృద్ధుల కోసం టీఏవీఐ, పిల్లలు, గుండె రంధ్రం ఉన్న వారి కోసం ఆక్టూడర్ వంటి ఆధునిక సాంకేతికతను ఉపయోగించి స్టెంట్లు తయారు చేస్తారు. గుండె సంబంధిత బాధితులకు వేసే స్టెంట్లు ఇప్పటివరకు విదేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి. దీంతో రోగులపై ఆర్థికంగా భారం పడుతున్నది. ఇప్పుడు ఈ సంస్థ ఇక్కడ ఉత్పత్తి ప్రారంభించనుండటంతో తక్కువ ధరకు స్టెంట్లు లభిస్తాయి.