Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

తెలంగాణలో అడుగుపెట్టనున్న భారత్‌ జోడో యాత్ర..

తెలంగాణలో 375 కిలోమీటర్లు నడవనున్న రాహుల్‌
13 కమిటీలతో టిపిసిసి విస్తృత ఏర్పాట్లు

కర్నాటకలోని రాయచూర్‌ నుండి 23 తేది ఉదయం 10 గంటలకు తెలంగాణలోని మహబూబ్‌ నగర్‌ జిల్లా, గూడబెల్లూరులో అడుగుపెట్టనుంది. కర్నాటక, తెలంగాణ సరిహద్దులోని గూడబెల్లూరులో రాహుల్‌ భారత్‌ జోడో యాత్రను స్వాగతించేందుకు టీపీసీసీ ఘన ఏర్పాట్లు చేసింది. గూడబెల్లూరులో అల్పాహారం అనంతరం మద్యాహ్నం నుండి యాత్ర మొదలై దీపావళి నిమిత్తం మూడు రోజుల పాటు అంటే 26వ తేది వరకు బ్రేక్‌ తీసుకోనుంది. 27 తేది ఉదయం గూడబెల్లూరులో ప్రారంభం కానున్న యాత్ర మక్తల్‌ చేరుకుని తెలంగాణలో సుదీర్ఘంగా 16 రోజులపాటు 19 అసెంబ్లీ, 7 పార్లమెంట్‌ నియోజకవర్గాల మీదుగా 375 కిలోమీటర్ల మేరకు కొనసాగుతూ నవంబర్‌ 7న మహారాష్ట్రలో ప్రవేశించనుంది. 16 రోజుల యాత్రలో దీపావళికి మూడు రోజులు, నవంబర్‌ 4న ఒకరోజు సాదారణ బ్రేక్‌ తీసుకోనున్న యాత్ర తదనంతరం 12 రోజులపాటు జనజీవన స్రవంతితో ముందుకు సాగనుంది. కొన్ని ప్రాంతాల్లో కార్నర్‌ మీటింగులు, మరి కొన్ని ప్రాంతాల్లో ఉదయపు అల్పాహారం, మరి కొన్ని ప్రాంతాలలో నైట్‌ హాల్ట్‌ లు చేస్తూ రాహుల్‌ గాంధీ రోజుకు 20 నుండి 25 కిలోమీటర్ల మేరకు పాదయాత్రతో ముందుకు సాగనున్నారు. ఇక హైదరాబాద్‌ నగరంలోని బోయినిపల్లిలో ఒకరోజు నైట్‌ హాల్ట్‌ చేయనుండగా నెక్లెస్‌ రోడ్‌ లో కార్నర్‌ మీటింగ్‌ లో రాహుల్‌ పాల్గొని ప్రసంగించనున్నారు.
అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో యాత్ర..
తెలంగాణలోని మక్తల్‌ నియోజకవర్గంలో అడుగుపెట్టే పాదయాత్ర, నారాయణ్‌ పేట్‌, దేవరకద్ర, మహబూబ్‌ నగర్‌, జడ్చర్ల, షాద్‌ నగర్‌, రాజేంద్ర నగర్‌, బహుదూర్‌ పుర, చార్మినార్‌, గోషా మహల్‌, నాంపల్లి, ఖైరాతబాద్‌, కూకట్‌ పల్లి, శేరిలింగపల్లి, పటాన్‌ చెరువు, సంగారెడ్డి, ఆందోల్‌, నారాయణ్‌ ఖేడ్‌, జుక్కల్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో, మహబూబ్‌ నగర్‌, చేవెళ్ల, హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, మల్కాజిగిరి, మెదక్‌, జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల మీదుగా కొనసాగనుంది.
నాలుగు రాష్ట్రాలను దాటుతూ వచ్చిన రాహుల్‌ పాదయాత్రలో అతిపెద్దనగరంగా హైదరాబాద్‌ ప్రవేశించనుండగా నగరంలో ఆరాంఘర్‌, చార్మినార్‌, మోజాంజాహి మార్కెట్‌, గాంధీ భవన్‌, నాంపల్లి దర్గా, విజయనగర్‌ కాలనీ, పంజాగుట్ట, అమీర్‌ పేట్‌, కూకట్‌ పల్లి, మియాపూర్‌, పటాన్‌ చెరువు, ముత్తంగి, సంగారెడ్డి క్రాస్‌ రోడ్‌, జోగిపేట, పెద్దశంకరం పేట, మద్కూర్‌ వరకు యాత్ర కొనసాగుతుంది.
టీపీసీసీ విసృత ఏర్పాట్లు..
భారత జాతి సమైక్యతా నినాదంతో తెలంగాణాలో అడుగుపెడుతున్న రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్రకు టి పి సి సి విసృత ఏర్పాట్లు చేయనుంది. పలు బృందాలతో సాంస్కృతిక కార్యక్రమాలు, కార్నర్‌ సమావేశాలలో కాంగ్రెస్‌ బలాన్ని నిరూపించుకునే విధంగా ప్రత్యేక కార్యక్రమాలతోపాటు పాదయాత్రలో అనుసరించాల్సిన విధి విదానాలతో రూట్‌ మ్యాప్‌ పై టీపీసీసీ ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది.
కాంగ్రెస్‌లోని కొందరు సీనియర్‌ నేతలు సారధ్యం వహించనున్న ఈ 10 కమిటీలతో పాదయాత్ర పొడవునా యాత్రను సమన్వయం చేసుకుంటూ రాహుల్‌ గాంధీతో కలిసి ముందుకు సాగనున్నారు. ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో ముందుకు దూసుకు పోతున్న కాంగ్రెస్‌ శ్రేణులు, నాయకులు, భారత్‌ జోడో యాత్రను కూడా సమన్వయం చేసుకుంటూ రాహుల్‌ కవాతును విజయవంతంగా ముందుకు తీసుకు వెళ్లేందుకు భారీ ఏర్పాట్లతో రంగం సిద్దం చేసుకుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img