తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్) డా.శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, జనవరి 23న మూడోదశ ఉధృతి పెరిగిందని చెప్పారు. రాష్ట్రంలో కొవిడ్ పాజిటివిటీ రేటు అత్యధికంగా 5 శాతానికి వెళ్లిందని, ప్రస్తుతం 2 శాతం కంటే తక్కువ ఉందని ఆయన వివరించారు. రాష్ట్రంలో కరోనా థర్డ్ వేవ్ ముగిసిందన్నారు. ఫస్ట్ వేవ్ 10 నెలలు, సెకండ్ వేవ్ 6 నెలలు, థర్డ్ వేవ్ మూడు నెలలు మాత్రమే ఉందనీ శ్రీనివాస్ తెలిపారు. టీకా తీసుకున్న వారిలో వైరస్ ప్రభావం తక్కువగా ఉందని అన్నారు. ఫీవర్ సర్వే ద్వారా ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి కిట్లు అందజేశారు. రాష్ట్రంలో ఎలాంటి కొవిడ్ ఆంక్షలు లేవు. కరోనా మూడో దశ ముగిసినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కొవిడ్ నిబంధనలు తప్పక పాటించాలన్నారు. ఫివర్ సర్వే వల్ల సత్ఫలితాలు వచ్చాయన్నారు. వచ్చే కొద్ది నెలలపాటు కొత్త వేరియంట్ పుట్టే అవకాశం లేదని అన్నారు. కొవిడ్ త్వరలో ఎండమిక్ అవుతుంది. భవిష్యత్తులో సాధారణ ఫ్లూలా కొవిడ్ మారుతుందని అన్నారు. కొవిడ్ ఆంక్షలు లేనందు వల్ల అన్ని సంస్థలు వందశాతం పని చేయొచ్చని అన్నారు. ఉద్యోగులు పూర్తి సంఖ్యలో కార్యాలయాలకు వెళ్లొచ్చని అన్నారు. ఐటీ కంపెనీలు సైతం వర్క్ ఫ్రం హోం తీసివేయవచ్చని చెప్పారు. విద్యాసంస్థలను పూర్తిగా ప్రారంభించామని చెప్పారు.