తెలంగాణలోని పురపాలికల్లో కొత్తగా 288 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జీహెచ్ఎంసీలో ఇవి విజయవంతం కావడంతో వీటిని పట్టణాలకు విస్తరించాలని వైద్య ఆరోగ్యశాఖపై సమీక్షలో ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో అన్ని మున్సిపాలిటీల్లో కొత్తగా మొత్తం 288 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసేందుకు సిద్దమైంది. వచ్చే ఆరు నెలల్లో వీటిని అందుబాటులోకి తేవాలని లక్ష్యం ఏర్పాటు చేసుకున్నది. మంగళవారం ఎంసిహెచ్ఆర్డిలో వైద్యారోగ్య శాఖ, మున్సిపల్ శాఖలు సంయుక్తంగా పట్టణాల్లో బస్తీ దవాఖానల ఏర్పాటు గురించి చర్చించాయి. ఈ సమీక్షలో ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, సీఎం ఓఎస్డి గంగాధర్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, టీ ఎస్ టీ ఎస్ వెంకటేశ్వర్ రావు, సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, రెండు దశల్లో వచ్చే జూన్ 2 నాటికి వీటిని అందుబాటులోకి తీసుకు వస్తామన్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 544 బస్తీ దవాఖానలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ దిశగా అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.