: మంత్రి హరీశ్రావు
దళిత బంధు కేవలం కార్యక్రమమో, పథకమో కాదు, అదొక ఉద్యమం అని వైద్య, అరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. దళితులకు డబ్బులు పంచడం మాత్రమే పరిష్కారం కాదు. సామాజిక అస్పృశ్యతను తొలగించాలనేది సీఎం కేసీఆర్ లక్ష్యమని అన్నారు. దళిత బంధు లబ్ధిదారులు సరైన యూనిట్ ఎంపిక చేసుకునేలా..ఆ యూనిట్ను గ్రౌండ్ చేసేలా ఉన్నత అధికారులు, ప్రజా ప్రతినిధులు ఒక్కొక్కరు ఒక్కో లబ్ధిదారునికి మార్గనిర్దేశం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ దవాఖానల్లో 16% కాంట్రాక్టు ఏజెన్సీలను ఎస్సీలకు రిజర్వ్ చేసే ప్రక్రియను మంత్రి మంగళ వారం కోఠిలోని కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయంలో ప్రారంభించారు. చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, డీపీహెచ్ శ్రీనివాస్ రావు, డీఎంఈ రమేష్ రెడ్డి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, సీఎం ఓఎస్డీ గంగాధర్ తో కలిసి డ్రా ద్వారా హాస్పిటళ్లను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. దళితులు కూలి పనులకు మాత్రమే పరిమితం కావొద్దని, ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు కాంట్రాక్టుల్లోనూ రిజర్వేషన్ కల్పించాలని స్వాతంత్య్రానికి ముందే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బ్రిటిష్ ప్రభుత్వానికి లేఖ రాశారని గుర్తు చేశారు. నాడు అంబేద్కర్ కన్న కలలను నేడు సీఎం కేసీఆర్ నిజం చేశారని అన్నారు.