దిల్లీలో సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. తెలంగాణలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ అక్కడ తన నివాసం నుంచి సమీక్షిస్తున్నారు. అధికారులకు సహాయ, పునరావాస చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్తో ఫోన్లో మాట్లాడి పలు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్లు, పూర్తి ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు తగిన చర్యలు చేపట్టాలని సీఎస్ను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందుకు సంబంధించి మున్సిపల్ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, రోడ్లు భవనాల శాఖ, విద్యుత్ శాఖల అధికారులు కింది స్థాయి వరకు తమ ఉద్యోగులను అప్రమత్తం చేయాలన్నారు.భారీ ఎత్తున వరద పోటెత్తడంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులు, చెరువులు కుంటలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో, లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపడుతూ వరద ముంపు ప్రాంతాలలో సహాయక చర్యలు చేపట్టాలని సీఎస్ను ముఖ్యమంత్రి ఆదేశించారు.వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో, ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ బలగాలను సిద్ధం చేసుకోవాలన్నారు. వర్షాల నేపథ్యంలో తమ తమ నివాసాల నుంచి బయటికి వచ్చే ప్రయత్నం చేయకుండా సురక్షితంగా ఉండాలని, వర్ష ప్రభావిత వరద ముంపు ప్రాంతాల ప్రజలను సీఎం కేసీఆర్ కోరారు.
వారం రోజులుగా దిల్లీలో మకాం వేసిన సీఎం ఇప్పటి వరకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, నితిన్ గడ్కరీ, గజేంద్ర సింగ్ షేకవత్తో భేటీ అయ్యారు. నేడు పలువురు కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి కేసీఆర్ కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.