: మంత్రి ఎర్రబెల్లి
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంచాయతీరాజ్ శాఖ రోడ్లకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నతాధికారులను ఆదేశించారు.ఆ మేరకు రానున్న మూడు రోజుల్లోగా కొత్త రోడ్డకు ప్రతిపాదనలు పంపించాలని అధికారులకు మంత్రి బుధవారంనాడు ఆదేశాలు జారీ చేశారు. . అదేవిధంగా ఇప్పటికే మంజూరైన పనుల పురోగతిని మంత్రి సమీక్షించారు. ఇప్పటికే పదోన్నతులు పొందిన 57 మంది డీపీఓలు, ఎంపీడీఓలకు పోస్టింగులు ఇవ్వాలని ఆదేశించారు. అలాగే ఇంజనీరింగ్ విభాగంలోని ఇంజనీర్లకు పదోన్నతులు కల్పించాలని, ఇందుకు సంబంధించిన నివేదికలు సిద్ధం చేయాలని చెప్పారు. పంప్ మెకానిక్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిశీలించి, నిబంధనలకు అనుగుణంగా తక్షణమే వాటిని పరిష్కరించాలని అధికారులకు సూచించారు.ఇంకా పూర్తికాని వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డులను సాధ్యమైనంత త్వరగా పూర్తయ్యే విధంగా చూడాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఇంజినీర్ ఇన్ చీఫ్ సంజీవ రావు తదితరులు పాల్గొన్నారు.