వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతిన్న పంచాయతీరాజ్ శాఖ రోడ్ల నష్టాలను వెంటనే అంచనా వేయాలని, రెండు మూడ్రోజుల్లో తనకు నివేదికలు పంపించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో చేపట్టిన సీసీ రోడ్లు, ఉపాధి హామీ పథకం రోడ్లు, పీఎంజీఎస్ వై రోడ్లు ప్రగతి వంటి పలు అంశాల పై వరంగల్ లోని మంత్రి క్యాంప్ కార్యాలయం, ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో సంబంధిత ఉన్నతాధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రోడ్ల మరమ్మతులను త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు. వర్షాలకు నష్టం జరిగిన పీఆర్ రోడ్ల వివరాలు, నష్టం అంచనాలు, వాటి మరమ్మతులకు ప్రతిపాదనలతో రెండు, మూడు రోజుల్లో అధికారులు మళ్ళీ సమావేశం కావాలని ఆదేశించారు.