దేశంలో దుర్మార్గ పాలన నడుస్తున్నదని, ఎనిమిదేండ్లుగా మోదీ ఏలుబడిలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. దేశంలో రాక్షస పాలన అంతం కావాలంటే సీఎం కేసీఆర్ ముందుకురావాలన్నారు. కేసీఆర్ మాత్రమే దేశాన్ని బాగు చేయగలరని దేశం కోసం సీఎం కేసీఆర్ మరో ఉద్యమం చేపట్టాలని కోరారు. బీజేపీ ముక్త్ భారత్ దిశగా తామంతా ముఖ్యమంత్రి వెంట నడుస్తామని చెప్పారు. తెలంగాణ భవన్లో మీడియాతో బాల్క సుమన్ మాట్లాడుతూ, దేశంలోని వ్యవస్థలను మోదీ ప్రభుత్వం నాశనం చేసిందని కార్పొరేట్ శక్తులకు లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారని ఫైరయ్యారు. మోదీ పాలనలో దేశంలోని ఏ వర్గానికి మేలు జరుగటం లేదని రైతులు రాజులుగా మారాలంటే సీఎం కేసీఆర్తోనే సాధ్యమని చెప్పారు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. తెలంగాణ తరహా అభివృద్ధి కోసం దేశ ప్రజలంతా సీఎం కేసీఆర్ వైపు చూస్తున్నారని తెలిపారు. దేశ ప్రజలంతా సీఎం కేసీఆర్ రాకకోసం ఎదురు చూస్తున్నారని ఎంపీ కవిత అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఇతర రాష్ట్రాల రైతులు మెచ్చుకుంటున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కోరారు. ఒక విజన్ ఉన్న నాయకుడి కోసం దేశమంతా ఎదురుచూస్తున్నదని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు.