కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే గాంధీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తోందన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గాంధీ కుటుంబానికి కష్టం వస్తే మనందరికీ కష్టం వచ్చినట్లేనని.. ప్రతీ కార్యకర్త స్పందించాలని చెప్పారు. బీజేపీ తమ అనుబంధ విభాగాలుగా సీబీఐ, ఈడీలను మార్చుకుందని విమర్శించారు. టీపీసీసీ ముఖ్య నాయకులతో గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో రేవంత్ మాట్లాడారు. జాతీయ సమగ్రత కోసం యంగ్ ఇండియా ట్రస్ట్ ద్వారా నేషనల్ హెరాల్డ్ పత్రిక నడుపుతున్నారని ఆయన అన్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆస్తుల విషయంలో ఎలాంటి నగదు లావాదేవీలు జరగనప్పటికీ సోనియా, రాహుల్ గాంధీలకు ఈడీ నోటీసులిచ్చి భయపెట్టాలని చూస్తోందని మండిపడ్డారు. దేశ సమైక్యతను దెబ్బతీసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని ఆరోపణలు గుప్పించారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.. సోమవారం విచారణ పూర్తయ్యే వరకు అన్ని రాష్ట్రాల ఈడీ ఆఫీసుల ఎదుట కాంగ్రెస్ నిరసన తెలుపుతామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్లో కూడా నల్లదుస్తులు, నల్ల కండువాలు ధరించి ఈడీ ఆఫీసు వరకు ర్యాలీ తీయబోతున్నట్లు చెప్పారు. అలాగే గ్రేటర్ పరిధిలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై అఘాయిత్యాలపై ఈనెల 15 అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని, ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్, బీజేపీలను కూడా ఆహ్వానిస్తామని తెలిపారు. రైతు రచ్చబండ కార్యక్రమంలో మరింత స్పీడ్ పెంచాలని కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.