మేధావులు ఎప్పుడైతే సమాజాన్ని చైతన్యవంతం చేస్తారో.. ఆ సమాజం బాగా ముందుకు పోతుందని సీఎం కేసీఆర్ అన్నారు. మెడికల్ విద్యా రంగంలో కృషి చేస్తూనే నవ సమాజ నిర్మాణానికి, నవ భారత నిర్మాణానికి మీరంతా అడుగులు ముందుకు వేయాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నానని కేసీఆర్ పేర్కొన్నారు. వరంగల్లో ప్రతిమ మెడికల్ కాలేజీని ప్రారంభోత్సవం చేసిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ తయారవుతుందన్నారు. ప్రయోగత్మకంగా.. సిరిసిల్ల, ములుగు నియోజకవర్గాల్లో 100 శాతం హెల్త్ ప్రొఫైల్ను తయారు చేయడం జరిగిందన్నారు. ఈ హెల్త్ ప్రొఫైల్ ద్వారా ఒక వ్యక్తికి ఏ రకమైన జబ్బు వచ్చినా.. ఏ రకమైన యాక్సిడెంట్ జరిగినా.. ఒక్క నిమిషంలో డేటా బయటపడుతుంది. 119 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం పూర్తయితే నిమిషంలోనే ప్రతి ఒక్కరి ఆరోగ్య చరిత్ర తెలుస్తుంది. ఎవరికి ఎక్కడ ఎలాంటి ఆరోగ్య సమస్య సంభవించినా నిమిషాల్లో వారి డేటా బయటపడుతుందన్నారు. క్షణాల్లో వైద్యం అందుతుందన్నారు. అద్భుతమైన విజయాలు సాధించిన వాళ్లం అవుతాం. హెల్త్ యూనివర్సిటీని కూడా వరంగల్లోనే నెలకొల్పామని చెప్పారు. వరంగల్ లో నెలకొల్పుతున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి 2000 పడకలతో ఏర్పాటు అవుతోంది. 24 అంతస్తుల్లో నిర్మిస్తున్నామని చెప్పారు. ఈ మెడికల్ సిటీ హైదరాబాద్ను మించి పోతుందన్నారు. బ్రహ్మాండమైన ఆ సదుపాయం అందుబాటులోకి వస్తే హైదరాబాద్ వారే వరంగల్కు వచ్చే పరిస్థితి ఏర్పడుతుందని కేసీఆర్ తెలిపారు.