మంత్రి కేటీఆర్ సోమవారం మహబూబ్ నగర్లో పర్యటించారు. పట్టణంలోని శాంత నారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రూప్-1, గ్రూప్-2, కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల శిక్షణకు అవసరమైన స్టడీ మెటీరియల్ను మంత్రులు కేటీఆర్,శ్రీనివాస్ గౌడ్లు నిరుద్యోగ యువతి, యువకులకు ఉచితంగా పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు డా. లక్ష్మారెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకటరావు, అదనపు కలెక్టర్ తేజాస్ నందులాల్ పవర్, ఎస్పీ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. నిరుద్యోగ యువత రాబోయే ఆరు నెలల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండి సీరియస్గా ప్రిపరేషన్ పూర్తి చేసి ఉద్యోగాలు సాధించాలని మంత్రి కేటీఆర్ సూచించారు. ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ పట్టణం పూర్తి స్థాయిలో వేగంగా అభివృద్ధి చెందుతోందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.మంత్రి శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి మేరకు మహబూబ్ నగర్ పట్టణానికి అవసరమైన నిధులు మున్సిపల్ శాఖ ద్వారా మంజూరు చేస్తామని ఆయన వెల్లడిరచారు. పట్టణ అభివృద్ధికి అవసరమైన మేర తమ సహకారం ఉంటుందని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ సుమారు 90 వేల ఉద్యోగాలను భర్తీ చేసే ప్రక్రియ చేపట్టారని తెలిపారు.