బీజేపీ ప్రభుత్వంపై ఆర్థిక మంత్రి హరీశ్రావు ధ్వజం
విశాలాంధ్ర`హైదరాబాద్: నీతి ఆయోగ్ సిఫార్సులను కేంద్రం చెత్తబుట్టలో వేసిందని, సెస్ను 10 నుంచి 20 శాతానికి పెంచుకుని రాష్ట్రాలకు నిధులు తగ్గించిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. సీఎం కేసీఆర్ శనివారం మీడియా సమావేశంలో నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన విషయం విధితమే. అయితే, కేసీఆర్ వ్యాఖ్యలపై నీతి ఆయోగ్ నోట్ను విడుదల చేసిన క్రమంలో హరీశ్రావు ఆదివారం మీడియాతో మాట్లాడారు. సెస్ల ద్వారా కేంద్రం 15.47 లక్షల కోట్లు సమకూర్చుకుందని, అందులో రాష్ట్రాల వాటా 8.60 లక్షల కోట్లు రావాలన్నారు. ఫైనాన్స్ కమిషన్ నిధులు రాష్ట్రాలకు 29.6 శాతమే ఇస్తోందని దుయ్యబట్టారు. నీతి ఆయోగ్ అంకెల గారడి చేస్తోందని హరీశ్రావు మండిపడ్డారు. 2015-16లో సీఎస్ఎస్ ద్వారా రూ.6 వేల కోట్లు, 2016-17లో రూ.6,695 కోట్లు వచ్చాయని వివరించారు. నీతి ఆయోగ్ రాజకీయ రంగు పులుముకుందనీ, బీజేపీకి వంతపాడుతూ ప్రకటనలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పాల్సింది పోయి… తప్పుడు ప్రకటన చేసిందంటూ హరీశ్రావు ధ్వజమెత్తారు. వాస్తవాలను తప్పుదోవ పట్టిస్తోందని అన్నారు. పథకాల అమలుకోసం నీతిఆయోగ్ చెప్పినా కేంద్రం నిధులు మంజూరు చేయలేదని, ఇప్పుడేమో నిధులు ఇచ్చినా వాడుకోలేదని నీతిఆయోగ్ చెబుతోందని మండిపడ్డారు. రూ.24వేల కోట్లు ఇవ్వాలని అడిగితే పైసా విదల్చలేదని, ఇక ఆ వ్యవస్థకు ఏం విలువ ఉంది? అని ప్రశ్నించారు. నిధులు మంజూరు చేయాలని చాలాసార్లు వేడుకున్నామన్నారు.
ఇందిరాగాంధీ, వాజ్పేయి, మన్మోహన్ ప్రభుత్వాలు ఆర్థిక సంఘం సిఫార్సులను కచ్చితంగా అమలు చేశాయని హరీశ్రావు పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రగతి పథంలో దూసుకెళ్తున్న తెలంగాణపై ద్వేషం ఎందుకని ప్రశ్నించారు. ఆర్థిక సంఘం సిఫారసులను మోదీ ప్రభుత్వం అమలు చేయలేదని, దీనిపై నీతి ఆయోగ్ ఎందుకు ప్రశ్నించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీతి ఆయోగ్ ప్రకటన సత్యదూరమని… కేసీఆర్ అడిగిన ఏ ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వలేదని విమర్శించారు.