విశాలాంధ్ర, హైదరాబాద్ : మురుగు నీటి శుద్ధీకరణలో ఇప్పటికే దేశంలో అన్ని నగరాల కన్నా హైదరాబాద్ నగరం అగ్రస్థానంలో ఉన్నదని, నగరంలో మురుగు నీటి శుద్ధీకరణలో సామర్య్థాన్ని మరింత పెంచుకుంటూ ఈ ఎఫ్ఎస్టీపి (ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్)ల నిర్మాణాన్ని చేపట్టామని రాష్ట్ర ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి కేటిఆర్ అన్నారు. శనివారం హైదరాబాద్ పి.వి.నర్సింహ రావు మార్గ్లోని పీపుల్స్ ప్లాజా వద్ద 87 సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. వీటితో పాటు ఆయన జలమండలి ఉప్పల్లోని నల్ల చెరువులో నూతనంగా నిర్మించిన ఎఫ్ఎస్టీపిని వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. అనంతరం ప్రజలకు అవగాహన కోసం పోస్టర్ను, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…మానవ రహిత పారిశుద్ధ్య పనుల్లో టెక్నాలజిని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ మినీ ఎయిర్టెక్ మిషన్లను రూపొందించి దేశానికే ఆదర్శంగా నిలిచిన జలమండలి ప్రస్తుతం ఎఫ్ఎస్టీపిల నిర్మాణంతో మరో మైలు రాయిని అందుకుందని అన్నారు. ఓఆర్ఆర్ (ఔటర్ రింగ్ రోడ్)లోపలి గ్రామాల్లోని సెప్టిక్ ట్యాంక్ మానవ వ్యర్థాలను శుద్ధి చేసి పర్యావరణంతో పాటు ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ ఎఫ్ఎస్టీపిలను రూపకల్పన చేశారని పేర్కొన్నారు. ఇంతకుముందు ఉత్పన్నమయ్యే సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలను చెరువులు, కాలువలు, కుంటల్లో పారబోసే వారని, దీన్ని నివారించడానికి సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలను శుభ్రపరిచే వాహనాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ వాహనాల ఆపరేటర్లకు శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇచ్చామని, వీరు నగరంలోని సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలను ప్రతిపాదిత ఎఫ్ఎస్టీపిలలో డంపింగ్ చేయడం వల్ల ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తవని పేర్కొన్నారు. జలమండలి ఆధ్వర్యంలో ఇప్పటికే మూడు ఎఫ్ఎస్టీపిలు నిర్మిస్తుండగా, వీటిలో ఒకటి నేడు ప్రారంభించామని, మరో రెండు కూడా వినియోగంలోకి వస్తే మానవ వ్యర్థాలను చెరువుల్లో, కుంటల్లో వేసే పరిస్థితి ఉండదని ఆయన వివరించారు. అంతేకాకుండా చాలా తక్కువ ధరలో ప్రజలకు ఈ సేవలను అందిస్తున్నామని అన్నారు. సెప్టిక్ ట్యాంక్ వాహనాల ఆపరేటర్లకు, కార్మికులకు త్వరలోనే హెల్త్ కార్డులు కూడా అందజేస్తామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. ఇలాంటి ఎఫ్ఎస్టీపీలను హైదరాబాద్తో పాటుగా రాష్ట్రంలో మరో 71 ప్రాంతాల్లో నిర్మాణం చేపడుతున్నట్లు ఆయన వివరించారు. ఈ సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ కోసం 155313/14420కు కాల్ చేసి వినియోగదారులు ఈ సేవలను పొందవచ్చు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, ఖైరతాబాద్ ఎమ్మేల్యే దానం నాగేందర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతా రెడ్డి, స్థానిక కార్పొరేటర్ విజయా రెడ్డి, జలమండలి ఎండీ దాన కిషోర్, ఈడీ డా.సత్యనారాయణ, జలమండలి డైరెక్టర్లతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.