పాదయాత్రలో భాగంగా జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధర్మాపురంలో పత్తి రైతులను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కలిశారు. పత్తి చేలో కూలీలను కలిసి వారి సమస్యలు తెలుకున్నారు. రేవంత్ రాకతో కూలీలు తమ సమస్యలను చెప్పుకున్నారు .రోజు కూలీ చేస్తే వంటనూనెకే సరిపోవడం లేదని ఆవేదన చెందారు. కాంగ్రెస్ ప్రభుత్వంలొనే సంక్షేమం జరిగిందని, కాంగ్రెస్ రైతులను ఆదుకుందని మహిళా రైతులు చెప్పారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని రేవంత్ హామీ ఇచ్చారు. భూమి లేని రైతులకు రూ.15 వేలు ఇస్తామని చెప్పారు. అనంతరం ధర్మపురంలో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లను రేవంత్ పరిశీలించారు. ఊరికి దూరంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లలో పిచ్చి మొక్కలు మొలిచి నిరుపయోగంగా మారాయని, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయని ఆరోపించారు.డబుల్ బెడ్ రూం ఇళ్లలో లభించిన ఖాళీ లిక్కర్ సీసాలే ఇందుకు నిదర్శనమని రేవంత్ రెడ్డి చూపించారు. రాష్ట్రంలో రాక్షన పాలన అంతం చేస్తామని, రాముడి పాలనే తమ లక్ష్యమని చెప్పారు. ప్రస్తుతం పాలకుర్తి నియోజకవర్గంలో రేవంత్ పాదయాత్ర కొనసాగుతోండగా.. ఆయన పాదయాత్ర 100 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది.