దళితుల అభ్యున్నతి కోసం తెలంగాణ చేపడుతున్న పథకాలు, విధాన నిర్ణయాలు ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని కొల్గూరు గ్రామంలోని 129 మంది దళిత బంధు లబ్దిదారులకు మంజూరు పత్రాలు, యూనిట్లను హరీశ్రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ, డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ జయంతి రోజున దళితబంధు లబ్ధిదారులకు యూనిట్లు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. ఒక పథకం కింద ఒక్కో లబ్ధిదారుడికి రూ. 10 లక్షల నగదు బదిలీ చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. నేటి నుంచి దళితబంధు యూనిట్ల ద్వారా లబ్ధిదారులు సంపాదించుకునే ప్రతి పైసా వారిదేనని స్పష్టం చేశారు. పార్టీలకు అతీతంగా ఈ పథకం కింద లబ్ధిదారులను ఎంపిక చేసి యూనిట్లను అందజేస్తున్నామని తెలిపారు. ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలకు కూడా ఈ పథకం కింద ఆర్థిక సాయం అందజేస్తున్నామని అన్నారు.