తెలంగాణలో 15-18 ఏళ్ల యువతీ యవకులకు వ్యాక్సినేషన్ ప్రారంభం..
తెలంగాణలో 15 నుంచి 18 ఏళ్ల వయసు పిల్లలకు కరోనా వ్యాక్సినేషన్ ఇవాళ ప్రారంభమైంది. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారికి టీకాలు వేస్తున్నారు. నగరంలోని బంజారాహిల్స్ పీహెచ్సీలో హరీశ్రావు కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ‘తల్లిదండ్రులంతా పిల్లలకు విధిగా వ్యాక్సిన్ వేయించాలి. పిల్లలకు వ్యాక్సిన్ వేయించే బాధ్యత తల్లిదండ్రులదే. వారికి టీకాలు వేయించేందుకు కళాశాలల యాజమాన్యాలూ బాధ్యతలు తీసుకోవాలి. రాష్ట్రంలో 1014 కేంద్రాల్లో 15-18 ఏళ్ల వారికి ఇవాళ్టి నుంచి కోవాగ్జిన్ వ్యాక్సిన్ వేస్తున్నామని తెలిపారు.అవసరమైతే వ్యాక్సిన్ కేంద్రాలు పంపిణీ పెంచుతామన్నారు. ఫస్ట్ డోస్ 100 శాతం పూర్తి చేసిన పెద్ద రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్న మంత్రి.. కేంద్రం ప్రశంసించిందన్నారు. దేశంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగున్నాయని తెలిపారు. గత వారం రోజుల్లోనే దేశంలో కరోనా కేసులు నాలుగు రెట్లు పెరిగాయన్నారు. ప్రతీ ఒక్కరు కరోనా నివారణ జాగ్రత్తలు పాటిస్తూ.. వ్యాక్సిన్ వేయించుకోవడం ద్వారా కట్టడి చేయవచ్చన్నారు. తప్పనిసరిగా మాస్క్ ధరించాలని.. చేతులు కడుక్కోవడం, భౌతిక దూరం పాటించడం, శ్యానిటైజర్ వినియోగం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణలో దాదాపు 22.7 లక్షల మంది 15-18 సంవత్సరాల లోపు యువతీయువకులు ఈ వ్యాక్సిన్ తీసుకునేందుకు అర్హులు. జీహెచ్ఎంసీ, మరో 12 మున్సిపల్ కార్పొరేషన్ పరిధిల్లో అర్హులైన వారు వ్యాక్సిన్ కోసం కోవిన్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో నేరుగా వ్యాక్సినేషన్ కేంద్రాలకు వెళ్లి వ్యాక్సిన్ తీసుకోచ్చని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ జీ.శ్రీనివాస రావు ఇతి వరకే తెలిపారు. అర్హులైన వారికి కోవాక్సిన్ డోస్ను మాత్రమే ఇవ్వనున్నారు. 2007 సంవత్సరం లేదా అంతకు ముందు పుట్టిన వారు ఈ వ్యాక్సిన్ తీసుకునేందుకు అర్హులు. వ్యాక్సిన్ తీసుకునేందుకు వెళ్లే వారు తమ తల్లిదండ్రులు, సంరక్షులను సైతం వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది.