పోడు సాగుదారులకు న్యాయం చేయాలనే అంశాలపై సీఎం కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని, దానికి అనుగుణంగా చిత్తశుద్ధితో పని చేయాలని అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి చెప్పారు.కలెక్టర్ కార్యాలయంలో ములుగు, భూపాల పల్లి, వరంగల్, మహబూబాబాద్, జిల్లాలకు సంబంధించిన పోడు భూములు సమస్యలు, అడవుల పరిరక్షణ, హరితహారం అంశాలపై ఆయా జిల్లాల జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలో, అటవీశాఖ అధికారులు, డీఎఫ్వోలు, రెవెన్యూ,గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..జిల్లాలో ఉన్న అటవీ భూములను పరిరక్షించాల్సిన భాద్యత అధికారులదేనని అన్నారు. ఇక నుంచి ఎకరం కూడా అటవీ ప్రాంతం ఆక్రమణకు గురికాకుండా చూడలని అధికారులను ఆదేశించారు.అటవీ, రెవెన్యూ గిరిజన సంక్షేమ శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలన్నారు. ఇప్పటికే పోడు వ్యవసాయం చేసుకుంటున్న వారికి గతంలో ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలు జారీ చేసిన నేపథ్యంలో.. ప్రస్తుతం ఇంకా ఎంత మందికి ఎన్ని ఎకరాలకు పట్టాలు అందించాలనే దానిపై సమగ్ర సమాచారం అందించాలన్నారు.