ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుతో లక్ష ఎకరాల భూమితో పాటు భద్రాచలం, పర్ణశాల సైతం మునిగిపోతాయని రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలపై రజత్ కుమార్ బుధవారం సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా రజత్ కుమార్ మాట్లాడుతూ.. కడెం ప్రాజెక్టుకు ఇటీవలే మరమ్మతులు చేయడంతో.. ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు. గడిచిన 100 ఏండ్లలో ఎప్పుడూ లేని విధంగా కడెం ప్రాజెక్టు ఎగువన భారీ వర్షం కురిసిందని తెలిపారు. వరదలు, వర్షాలపై ప్రభుత్వం సంసిద్ధంగా లేదనడం సరికాదన్నారు. వరద నష్టం అంచనాలపై మీడియాలో వస్తున్న కథనాలు నిరాధారం అని స్పష్టం చేశారు. సీడబ్ల్యూసీ 18 విభాగాల అనుమతి తర్వాతనే ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుందన్నారు.
చారిత్రాత్మక ప్రాంతాలకు ముప్పు..
పోలవరంతో లక్ష ఎకరాల వరకు మునిగిపోతాయి. బ్యాక్ వాటర్తో పంట నష్టంతో పాటు చారిత్రాత్మక ప్రాంతాలకు ముప్పు ఉందని తెలిపారు. భద్రాచలం, పర్ణశాల కూడా మునిగిపోతాయని చెప్పారు. పోలవరం బ్యాక్ వాటర్ విషయంలో స్టడీ చేసేందుకు కేంద్రానికి ఎన్నోసార్లు లేఖలు రాశామని తెలిపారు. బ్యాక్ వాటర్ నష్టం, ఇతరత్రా అంశాలపై కేంద్రం ఇప్పటికీ స్పందించలేదని పేర్కొన్నారు.భారీ వరదలతో కాళేశ్వరం ప్రాజెక్టుకు సుమారు రూ. 20 నుంచి 25 కోట్ల నష్టం జరిగిందని రజత్ కుమార్ తెలిపారు. అగ్రిమెంట్లో పేర్కొన్న విధంగా ఆ నష్టాన్ని నిర్వహణ సంస్థలే భరిస్తాయన్నారు. 45 రోజుల్లో కాళేశ్వరం పంప్ హౌస్ల మరమ్మతు పనులు పూర్తవుతాయని రజత్ కుమార్ స్పష్టం చేశారు.