ప్రకృతిని ఆరాధించే పండుగే బతుకమ్మ పండుగ అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం బన్సీలాల్ పేటలోని మల్టీపరÛ్పస్ ఫంక్షన్హాల్లో మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈనెల 26 నుండి అక్టోబర్ 3వ తేదీ వరకు నిర్వహించే బతుకమ్మ పండుగ మహిళల పండుగ అని, పేద, మధ్య తరగతి మహిళలు కూడా సంతోషంగా పండుగ జరుపుకోవాలనే ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు 2017 సంవత్సరం నుండి తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా కోటి 18 లక్షల చీరలను పంపిణీ చేస్తున్నట్లు, ఇందుకోసం 340 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. 30 రకాల డిజైన్ లు, వివిధ రంగులతో రాష్ట్రంలోని చేనేతలు తయారు చేసిన చీరలను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. దీంతో చేనేతలకు ఉపాధి కల్పించినట్లు అవుతుందని పేర్కొన్నారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో 52, 261 మందికి చీరలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.