ఈ మూడునెలలు ప్రణాళికబద్ధంగా కష్టపడి చదివి.. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. మొబైల్స్ వాడకాన్ని తగ్గించాలన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ను కేటీఆర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. జీవితం చాలా పెద్దది.. అపజయం ఎదురైనంత మాత్రాన కుంగిపోవద్దని చెప్పారు. నైపుణ్యం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటే ప్రయివేటు రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా సాధించుకున్న తెలంగాణలో.. ఎన్నో అద్భుతాలు సృష్టించామని పేర్కొన్నారు. సాగునీటి రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించామన్నారు. సాగునీటిని అందించడంతో బీడు భూములు కూడా సస్యశ్యామలం అయ్యాయని తెలిపారు. అభివృద్ధికి ప్రామాణికాలైన తలసరి ఆదాయం, జీఎస్డీపీలో ముందంజలో ఉన్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. మన నిధులు మన కోసమే ఖర్చు చేసుకుంటున్నామని చెప్పారు.