గ్రామ స్థాయిలోనే బాలలను రక్షించాలని ప్రభుత్వం గ్రామ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసిందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన గ్రామ బాలల రక్షణ అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బాలల రక్షణ కర దీపికను ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్రంలోని 12,769 గ్రామాల్లో కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇంకా కొన్ని గ్రామాల్లో కమిటీలు వేయాల్సి ఉంది. కమిటీలో సర్పంచ్ చైర్మన్గా, అంగన్వాడీ టీచర్ కన్వీనర్గా, గ్రామ స్కూల్ హెడ్ మాస్టర్, ఎంపీపీ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారని ఆయన తెలిపారు. కమిటీలు బాగా పని చేయాలని ఆయన సూచించారు. గ్రామ పంచాయతీ స్థాయిలోనే బాలల రక్షణ జరగాలి. పోలీస్ స్టేషన్, కోర్టుల దాకా వెళ్లే పరిస్థితి రావద్దు అన్నారు. రాష్ట్ర స్థాయి దాకా సమస్యలు పోవద్దు అంటే, సర్పంచులు ఆక్టివ్గా పని చేయాలి. బాలల హక్కుల కమిషన్ చెప్పిన విధంగా మార్గదర్శకాలు, సూచనలు పాటించాలి. బాలలను కార్మికులుగా, ఇండ్లలో పనులకు పెట్టుకోవడం వంటి వాటిని నివారించాలన్నారు. చదువుకునే వయసు పిల్లలు కచ్చితంగా స్కూల్ లో ఉండాలి. మన రాజ్యాంగంలో చెప్పినట్లుగా నిర్బంధ విద్యను అందించాలని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.