సీపీఐ మండల కార్యదర్శి శ్రీనివాస్
విశాలాంధ్ర-డుందిగల్ : నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి బాచుపల్లి మండలంలో ప్రభుత్వ భూములకు రక్షణే లేకుండా పోయింది. ప్రభుత్వ భూములపై కన్నేసిన కొందరు అక్రమార్కులు అదే పనిగా అందిన కాడికి కబ్జాలకు పాల్పడుతూ అమాయక ప్రజలే ఎరగా చేసుకొని కోట్లకు పడగలెత్తుతున్నారు. వివరాల్లోకి వెళితే నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్, బాచుపల్లి మండల్ పరిధి ముష్కరుల ముఠా ప్రభుత్వ భూములపై గద్దల్లా వాలుతూ అందిన కాడికి దోచేెస్తున్నారు. ఇదే విషయమై శనివారం బాచుపల్లి మండల సీపీఐ కార్యదర్శి పాలబిందెల శ్రీనివాస్ ఆధ్వర్యంలో తహసీల్దార్ సరితకు వినతపత్రం అందజేశారు. శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ భూముల పరిరక్షణలో తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది వెనకడుగు వేస్తున్నారని, పేద ప్రజల కష్టార్జితాన్ని పోగుచేసుకొని, అధికారులకు సవాల్ విసురుతున్న దొంగల మూఠాను అధికారులు పెంచి పోషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని అక్రమాలకు పాల్పడుతున్న ముష్కరులపై కేసులు నమోదు చెసి ప్రభుత్వ భూములను కాపాడాలని కోరారు. లేకపోతే సీపీఐ.. ప్రభుత్వ భూముల్లో ఎర్ర జెండాలు పెట్టి పేదలకు పంచుతామని అన్నారు. కార్యక్రమంలో మల్లయ్య, శివ, రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.