రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా వినాయక నిమజ్జనం వేడుకలు కొనసాగుతున్నాయని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా లక్షల సీసీ కెమెరాలు పోలీస్ హెడ్ క్వార్టర్స్కు అనుసంధానం చేసి పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ నగరంలో 35,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో సున్నితమైన ప్రదేశాలపై ప్రత్యేక నిఘా పెట్టామని, సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో భద్రతా పరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మహిళల భద్రత కోసం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి భద్రత కల్పించామన్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలపై ప్రత్యేక ఏర్పాటు చేశామని, రేపు (శనివారం) ఉదయం వరకు వినాయక నిమజ్జనాలు కొనసాగే అవకాశం ఉంటుందని డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పారు.